దున్నపోతులపోటీ
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
Chief Editor
Itsvizag.com
చాలా కాలం క్రితం ఒక రాజ్యం మీదకు మరొక రాజు దండెత్తి వచ్చాడు.అతని పేరు సనగర.ఆరాజ్యం లోని అన్ని ప్రాంతాలూ సనగరకు లొంగిపోయి దాసోహం అన్నాయి.కానీ,ఒక ప్రదేశంలోని వారు మాత్రం కొత్తరాజును ఎదిరించారు.దానితో కోపమొచ్చిన సనగర ఆ ప్రాంతం మీదకు సైన్యాన్ని పంపి మర్యాదగా లొంగకపోతే అందరినీ హతమారుస్తానని హెచ్చరించాడు.అక్కడి ప్రజలందరూ ఒకచోట సమావేశమై,ఏంచెయ్యాలి?ఏం చేస్తే తమ స్వాతంత్ర్యం నిలుస్తుందా అని చర్చించసాగారు.
‘మనం గనుక యుద్ధం చేస్తే ఎందరో ప్రాణాలు కోల్పోతారు, మన గ్రామాలన్నీ నేలమట్టమవుతాయి,మన కుటుంబాలన్నీ చెల్లాచెదురవుతాయి,అప్పటికీ ఎవరైనా మిగిలిఉంటే వారు బానిసలుగా బందీలవుతారు’ అంటూ ఆలోచించసాగారు.
ఇంతలో ఒక వృద్ధుడు పైకిలేచి,‘శత్రువుతో పోరాడేందుకు మనదగ్గర పటిష్టమైన ఆయుధాలు లేవు.కాబట్టి భుజబలంతో కాక,బుద్ధిబలంతో పోరాడాలి,గెలవాలి’అంటూ చెప్పుకొచ్చాడు.
అతని మాటకు అందరూ అంగీకరించి,ఒక నిర్ణయానికి వచ్చి,తమ తరపున ప్రతినిధులుగా కొందరిని సనగర దగ్గరకు పంపించారు.ఆ ప్రతినిధులు సనగరను కలసి,‘రాజా,యుద్ధం అంటూ జరిగితే,మీవైపు,మావైపూ,ఇరుపక్షాల సైనికులూ మరణిస్తారు.పైగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.కాబట్టి, మనం దున్నపోతుల పందెం పెడదాం,మీ దున్నపోతు గెలిస్తే మేమందరం మీకు లొంగిపోతాం.మా దున్నపోతు విజయం సాధిస్తే మమ్ముల్ని స్వతంత్రులుగా ఉండనివ్వండి’అంటూ కోరారు.

